ఈటల రాజేందర్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

Minister KTR Sensational Comments on Etela Rajender

బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి ఎట్టకేలకు స్పందించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీఆరెస్ పార్టీ ఈటలకు ఎలాంటి నష్టం చేయలేదన్నారు. టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆరెస్ ఎంత గౌరవం ఇచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు కేటీఆర్.

మంత్రిగా కొనసాగుతూనే మంత్రివర్గ నిర్ణయాలు తప్పుపట్టారని కేటీఆర్ విమర్శించారు. ఈటల చేసిన తప్పులను తానే స్వయం ఒప్పుకున్నారన్నారు. ఇలా చేసిన తర్వాత కూడా ప్రజల్లో సానుభూతి ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు. ఐదు సంవత్సరాల క్రితమే ఆత్మగౌరవం దెబ్బతింటే మంత్రిగా ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. ఐదేళ్ల నుంచి ఈటల ఇష్టంవచ్చినట్లు మాట్లాడినా..మంత్రిగా ఉంచామని గుర్తు చేశారు కేటీఆర్. ఈటల టీఆరెస్ లో కొనసాగేలా చివరి వరకు తాను ప్రయత్నించానన్నారు.

ఇక హుజురాబాద్ ఎన్నిక గురించి స్పందించిన కేటీఆర్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని…వ్యక్తుల మధ్య కాదన్నారు. హుజురాబాద్లో టీఆరెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. అధికారపార్టీ, బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించి మాట్లాడిన కేటీఆర్.అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల్లో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య తప్ప ప్రతిపక్షాలకు మాట్లాడే విషయం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్.

Spread the love