కోదాడ నుంచి ఎంఎల్ఏ గా …..
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ పాత తరం నటులకు కానీ, ఈ తరం లో ఉన్న ఎందరో కొత్త హాస్య నటులకు మార్గదర్శకంగా నిలిచి ఎంతో మంది కి ఆదర్శంగా నిలిచిన వేణు మాధవ్ యశోధా హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూత్రపిండాల వ్యాధితో భాదపడుతున్న ఆయన ఈ నెల 6 న సికింద్రాబాద్ లో ని యశోద ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం మధ్యాహ్నం 12.21 కు తుది శ్వాస విడిచారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఎస్వి కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సంప్రదాయం చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత మరలా ఎస్వి కృష్ణా రెడ్డి దర్శకత్వంలో
హంగామా చిత్రం లో హీరో గా నటించారు. తెలుగు ప్రజలకు దేవుడిగా నిలిచిన అన్న ఎన్టిఆర్ గారి చేత వేణు మాధవ్ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. టిడిపి కార్యలయం లో కూడా కొన్ని సంవత్సరాలు పని చేసిన వేణు మాధవ్ అన్న గారి చేత ఎన్నో ప్రశంసలు పొందారు. టిడిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు లో సైతం ప్రసంగించే అవకాశాన్ని వేణు మాధవ్ సంపాదించారు. సినిమాలోకి రంగ ప్రవేశం చేసిన తర్వాత వేణు మాధవ్ పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మా అసోసియేషన్ లో కీలక సభ్యుడిగా వేణు మాధవ్ వ్యవహరిస్తున్నారు. టిడిపి కి ప్రతి ఎన్నికలో ఆయన స్టార్ కాంపైనర్ గా ఆయన ఎన్నో సభలలో ప్రసంగించారు. టిడిపి లో ఎన్నో సంవత్సరాలు సేవలు అందించిన వేణు మాధవ్ గత ఎన్నికలలో కోదాడ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దమై నామినేషన్ కూడా ధాఖలు చేశారు. అయితే తరువాత జరిగిన కొన్ని పరిణామాల నేపధ్యంలో ఆయన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.
వేణు మాధవ్ నటించిన ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తొలి ప్రేమ సినిమాలో ఆయన పోషించిన ఆర్నాల్డ్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఏర్పడలేదు. ఆయన నటించిన దిల్ చిత్రం లో వేణు మాధవ్ కు, ఎల్బీ శ్రీరామ్ కు మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. లక్ష్మి చిత్రం లో ఆయన పోషించిన టైగర్ సత్తి పాత్ర ఆయనకు ఉత్తమ హాస్య నటుడి అవార్డుని సంపాదించి పెట్టింది. సై సినిమా లోని నల్ల బాలు అనే పాత్ర ఇప్పటికీ అందరి నోట్లో నానుతుంది.